రొయ్యలకు సుంకం మినహాయించేలా చూడండి
27% దిగుమతి సుంకంతో ఆక్వాకు నష్టం
ఆక్వా రైతాంగానికి అండగా నిలవాలి
ఏపీ జిడిపిలో మత్య్సరంగం కీలకం
కేంద్ర మంత్రి గోయల్ కు సీఎం బాబు లేక
భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై 27% దిగుమతి సుంకం విధించిన అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రప్రభుత్వంనికి సూచించారు.సుంకాల జాబితా నుంచి రొయ్యల
ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆదివారం ఆయన లేఖ రాశారు .రాష్ట్ర జిడిపిలో మత్య్సరంగం కీలక భూమిక పోషిస్తోందని ,అమెరికా సుంకాల కారణంగా ఆక్వా పరిశ్రమ నష్టపోతుందని తెలిపారు .ఈ సంక్షోభ సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేసారు .'భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27% దిగుమతి సుంకం విధించింది .ఈ నెల 5 నుంచే ఇది అమల్లోకి వచ్చింది .2023-24లో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి .వీటిలో రొయ్యలే 92% వాటాను కలిగి ఉన్నాయి .అమెరికాకు రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్ పై 27% దిగుమతి సుంకం విధించిన కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతోంది . ఈక్వేడార్ వంటి ఎగుమతిదారులపై 10% పన్ను మాత్రమే అమెరికా విధిస్తోంది . ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ ,వారికి అనుకూలంగా మారుతుంది . దీనికి తోడు మన దేశ ఎగుమతి దారులు .ఇప్పటికే 5.77%కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ భారాన్ని మోస్తున్నారు .అన్ని సుంకాలు కలుపుకుంటే ఈక్వడార్ కు ,భారత్ కు మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20% ఉంటుంది . ఈ కారణంగా అమెరికాకు వెళ్లే అన్ని ఎగుమతుల పైన ఈ భారం పడుతుంది .గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్ లు, పోర్టుల్లో ఉన్నాయి.వీటిపై సుంకం భారం పడుతుంది .యూరోపియన్ యూనియన్ లో భారత ఎగుమతి దారులు 50% తనిఖీ రేట్లు 4-7% దిగుమతి సుంకంతో సహా నాన్ టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు . వియత్నం వంటి దేశాలు ఈయుతో స్వేచ్ఛ , వాణిద్య ఒప్పందం (ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ -ఎఫ్ టి ఏ ) కింద జీరో డ్యూటీ పొందాయి . ఈ కారణంగా వియత్నం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయి
వియత్నం , థాయిలాండ్ , జపాన్ మార్కెట్లు భారత్ నుంచి సి ఫుడ్ ను కొనుగోలు చేసి , వాటిని ప్రాసెస్ చేసి , అమెరికాకు ఎగుమతి చేస్తాయి . అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్స్ లు కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి.ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో రైతాంగం ఉంది .27% సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతి దారులు నిలిపివేశారు . ఈ పరిణామాలు ఏపీ ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి . ఆక్వా రైతులు,హేచరీలు , ఫీడ్ మిల్లులు ,ప్రాసెసర్లు ,ఎగుమతి దారులు , ఇలా అందరికీ సమస్యలు వచ్చాయి అని పేర్కొన్నారు . అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి . సుంకాల నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు .సకాలంలో మీరు జోక్యం చేసుకొని ,సమస్యను పరిష్కరించడం వలన ఆక్వా రంగంపై ఆధారపడి బతుకుతున్న లక్షలాదిమంది జీవనోపాధిని కాపాడవచ్చు 'అని చంద్రబాబు పేర్కొన్నారు .
నేడు రాష్ట్రస్థాయి సమావేశం :
మత్స్యశాఖ కమిషనర్
అమెరికా నిర్ణయాలతో ఆక్వా రంగం ఎదుర్కొనున్న ఇబ్బందులపై ఇప్పటికే దృష్టి సారించామని .వీటిపై చర్చించడానికే సచివాలయం వేదికగా సోమవారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మత్య్సశాఖ కమిషనర్ రమా శంకర్ నాయక్ చెప్పారు . బాపట్లలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు . రొయ్యలపై అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలతో రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు . క్షేత్రస్థాయి అధికారులతో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులను కూడా భాగస్వాములుగా చేసి ఆక్వా రంగం పురోగమనానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు .అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలకు విరుగుడుగా వేరే దేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలించి , ఆక్వా రంగానికి అన్ని విధాలుగా భరోసా కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు .