రొయ్యకు కొయ్యగా 'ట్రంప్' రితనం
అమెరికాలో ఉంటున్న విద్యార్థులు,ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసిన ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మన రొయ్యని వదలలేదు .
అమెరికా సుoకాలతో ధరల పతనం
దిక్కుతోచని స్థితిలో సాగుదారులు
అమెరికాకు ఎగుమతి అవుతున్న రొయ్యలపై సుంకం విధించడంతో ఆక్వా రైతులతో పాటు ప్రధానమైన పది రకాల అనుబంధ రంగాలపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి .
రైతే తొలి బాధితులు . నెలల వ్యవధిలో కిలో రొయ్య ధర రూ .10 తగ్గితేనే విలవిల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఒక్కరోజులో రూ .40తగ్గేసరికి రైతుకు ఊపిరి ఆడటం లేదు .. 100 కౌంటు రావడానికి రైతుకు రూ .230-240 వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ధర రూ .240 గా ఉంది . చెరువులో వేసిన పిల్ల కనీసం 80 శాతం పెరిగితే ఈ ధరకు పెట్టుబడులు వస్తాయి. రూ .240 కంటే ధర తగ్గిన ఆశించిన సరుకు దొరక్కపోయినా ఎకరాకు సగటును రూ . 2 లక్షల వరకు నష్టం వాటిల్లుతుంది . ఇది అక్కడితో ఆగుతుందా ? ఇంకా కిందకి పడిపోతుందా ? అనే భయం సాగుదారులను వెంటాడుతుంది .
అనుబంధ రంగాలు కుదేలు
రొయ్య పిల్ల తయారీ కేంద్రాలు. మేతలు , మందులు తయారీ పరిశ్రమలు , విక్రయ దుకాణాలు .. ఫ్యాన్ సెట్లు తయారీ , విక్రయ కేంద్రాలు .. జనరేటర్లు అద్దెకిచ్చే వ్యాపారాలు .. ఐస్ ప్లాంట్లు .. లారీలు , ఇతర రవాణా వాహనాలు .. ప్రాసెసింగ్ ప్లాంట్లు .. పెట్రోల్ బంకులు .. పట్టుబడులపై ఆధారపడే కూలీలు .
ఇంకా ధరలు నిర్ణయించలేదు
స్థానికంగా ధరలు నిర్ణయం ఇంకా జరగలేదు .. ఈనెల 8 ,9 తేదీల్లో కైకలూరు , ఉండిలో అప్సాడా వైస్ చైర్మన్, మత్స్యశాఖ కమిషనర్ , ఆక్వా అనుబంధ రంగాల ప్రతినిధులు , రైతులతో సమావేశం నిర్వహించనున్నారు .అందులో ఆక్వా సాగులోని సమస్యలన్నీ చర్చకు వస్తాయి . రొయ్యలకు కనీసం మద్దతు ధర ఉండే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని.జిల్లా రొయ్య రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నంబూరి గణపతిరాజు వివరించారు .
ఉమ్మడి జిల్లాల్లో ఎకరాల్లో
ఆక్వా సాగు మొత్తం :2.90
రొయ్యలు 1.10
చేపలు 1.80
వార్షిక ఉత్పత్తి :4 లక్షల టన్నులు
విదేశాలకు ఎగుమతి 3.5 లక్షల టన్నులు
వార్షిక టర్నోవర్ రూ .18 వేల కోట్లు