Page:
  1. 1
  2. 2

మత్స్య ఉత్పత్తుల్లో మేటి

మత్స్య ఉత్పత్తుల రంగంలో ఆంద్రప్రదేశ్ ను మొత్తం ప్రపంచానికే ఆక్వాహబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.శుక్రవారం విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్విహించిన  భారత అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన  (ఐ.ఐ.ఎస్.ఎస్.) -2016 కార్యక్రమంలోఆయన అధ్యక్షోపన్యాసం ఇచ్చారు.ఈ రంగంలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధిస్తోందని తెలిపారు. మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 2009-10లో 20 శాతం ఉన్న ఏపీ వాటా 2014-15 సంవత్సరానికి ఏకంగా 45 శాతానికి పెరిగిందన్నారు. మత్స్యరంగ పరిశ్రమలు స్థాపించాలనుకున్నవారికి దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వని అత్యుత్తమ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎంపెడాతో కలిసి ‘ఆక్వాటిక్‌ క్వారంటైన్‌ కేంద్రం’, విశాఖలో ‘బ్రూడర్‌ మల్టిప్లికేషన్‌ కేంద్రం’, సూర్యలంకలో ‘మడ్‌క్రాబ్‌ సీబాస్‌ హ్యాచరీ’, అనంతపురంలోని పి.ఎ.బి. రిజర్వాయర్లో ‘నైల్‌ తిలాపియా శాటిలైట్‌ బ్రీడింగ్‌ కేంద్రం’ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామన్నారు. ఆరు జలాశయాల్లో నైల్‌ తిలాపియా రకం చేపల పెంపకానికి వీలుగా 2015-16లో కేజ్‌ కల్చర్‌ ప్రారంభించామని, మరో ఆరు రిజర్వాయర్లలో వాటిని ప్రారంభించడానికి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. 5,441 చెరువుల్లో చేప విత్తన పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. భీమవరంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో జాతీయ మత్స్య విశ్వవిద్యాలయం (‘నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్వాకల్చర్‌’)ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మత్స్య రంగ అభివృద్ధికి నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారు. తానే ప్రతినెలా ఆ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. విశాఖపట్నం, భీమవరంలలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌’ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు.

Source : eenadu